చెరువుల పునరుద్ధరణ బాధితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు.. హైడ్రా కమిషనర్ హామీ

  • సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హామీ
  • గూగుల్ మ్యాప్స్ ఆధారంగా 2024 జులై 19కి ముందున్న వారి గుర్తింపు
  • బడా కబ్జాదారులపై కఠినంగా, నిరుపేదలకు అండగా ఉంటామన్న ప్రభుత్వం
  • సున్నం, రామంతాపూర్ చెరువుల బాధితులతో కమిషనర్ ప్రత్యేక సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చెరువులను పునరుద్ధరించి, కబ్జాల నుంచి విముక్తి చేసే బృహత్తర కార్యక్రమంలో భాగంగా నివాసాలు కోల్పోతున్న నిరుపేదల పట్ల తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో కీలక నిర్ణయం తీసుకుంది. చెరువులను ఆక్రమించిన బడా కబ్జాదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూనే, జీవనోపాధి కోసం వచ్చి గుడిసెలు వేసుకున్న పేదలకు అన్యాయం జరగకూడదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వారికి అండగా నిలవనుంది. చెరువుల పునరుద్ధరణలో భాగంగా ఇళ్లు కోల్పోయిన అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇల్లు కేటాయించనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. శుక్రవారం మాదాపూర్‌లోని సున్నం చెరువు, రామంతాపూర్ చెరువు ప్రాంతాల బాధితులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై ఈ హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాధితుల గుర్తింపు ప్రక్రియను హైడ్రా వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా కేవలం అర్హులైన వారికే ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోంది. 2024 జులై 19వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించి, ఆ తేదీకి ముందు నుంచే అక్కడ నివాసం ఉంటున్న వారిని గూగుల్ మ్యాప్స్, శాటిలైట్ చిత్రాల ఆధారంగా గుర్తించి జాబితాలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానం వల్ల పేదల ముసుగులో లబ్ధి పొందాలనుకునే కబ్జాదారుల ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుందని అధికారులు భావిస్తున్నారు. నగరవ్యాప్తంగా చెరువుల వద్ద ఇళ్లు కోల్పోయిన వారందరికీ ఇదే నిబంధన వర్తిస్తుందని కమిషనర్ రంగనాథ్ తేల్చిచెప్పారు.

ఈ సమావేశంలో కమిషనర్ బాధితుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కోసం నల్గొండ, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ నుంచి వలస వచ్చి, చెత్త ఏరుకుంటూ జీవిస్తున్న వారే అధికంగా ఉన్నట్లు గుర్తించారు. బయట అద్దె ఇళ్లు దొరకని పరిస్థితుల్లోనే చెరువుల దగ్గర తలదాచుకోవాల్సి వచ్చిందని బాధితులు తమ ఆవేదనను వెళ్లగక్కారు. దీనిపై స్పందించిన రంగనాథ్, ప్రభుత్వం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు శాశ్వత గృహవసతి కల్పిస్తుందని భరోసా ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పక్కా ఆధారాలతో నివేదికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

కాగా, హైడ్రా ఇప్పటికే నగరంలో అనేక చెరువులను పునరుద్ధరించి, వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడి ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఇటీవల చెన్నై నుంచి వచ్చిన ఓ బృందం హైడ్రా చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసించడం గమనార్హం.



HYDRAA Commissioner
Revanth Reddy
Hyderabad lakes
lake restoration
double bedroom houses
Telangana government
encroachment
housing for poor
Sunnam Cheruvu
Ramantapur Cheruvu
HYDRAA

More Telugu News